Ticker

6/recent/ticker-posts

హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ప్రభుత్వం తీపికబురు.. ఇకపై రూ.5 లకే !


హైదరాబాద్ మహానగరంలో పేదల ఆకలిని తీర్చేందుకు పతభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకుంది. రూ.5కే భోజనాన్ని అందిస్తున్న 'అన్నపూర్ణ భోజన కేంద్రం' లను ఇకపై 'ఇందిరా క్యాంటీన్' పేరిట మరింత అభివృద్ చేసి అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ భోజన పథకం' పేరిట గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీమ్.. వేలాదిమందికి ఆకలి తీర్చింది. దాంతో కాంగ్రెస్స్ సర్కారు కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తుంది. పేరు మార్పుతో పాటు, క్యాంటీన్ల సేవల స్థాయిని కూడా మెరుగుపరిచనున్నారు.

ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం ఉదయాన్నే టిఫిన్ కూడా అందించనున్నారు. ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లు కేవలం రూ.5కే అందించనున్నారు. వలస కూలీలు, విద్యార్థులు, డైలీ వేజ్ కార్మికులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అనేక భోజన కేంద్రాలు తాత్కాలిక షెడ్లలో నడుస్తున్నాయి. వీటిని శాశ్వత భవనాలుగా తీర్చిదిద్దే ప్రణాళికకు సైతం GHMC ఆమోదం తెలిపింది. భోజన కేంద్రాల్లో శుభ్రత, హైజీన్‌, కూర్చునే వసతులు, నీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు పెంపొందించనున్నారు.

అంతే కాకుండా ఈ కేంద్రాల్లో త్వరలోనే డిజిటల్ పేమెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. QR కోడ్ స్కాన్‌, డిజిటల్ వాలెట్లు, GHMC ఫుడ్ కూపన్ల ద్వారా ముందస్తు బుకింగ్ వంటి విధానాలు అమలు చేయనున్నారు. ఈ విధంగా నగర ప్రజలకు మరింత అనుకూలంగా సేవలందించనుంది. మరోవైపు ఈ సమావేశంలో మరో కీలక తీర్మానం చేశారు. నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను 'పే అండ్ యూజ్' పద్ధతిలో మార్చనున్నారు. శుభ్రత, నిర్వహణా ప్రమాణాలు పెంచేందుకు ఈ చర్య అవసరమని అధికారులు భావిస్తున్నారు.